
అమరావతి, 28 మార్చి (హి.స.)
అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం రాష్ట్ర శాసన సభ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. గత ఐదేళ్లుగా అనిశ్చితి నీడలో, రాజకీయ కక్షసాధింపుల మధ్యలో నలిగిపోయిన అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి లోకేశ్తో పాటు సుమారు ఇరవై మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే రాజధానిపె నెలకొన్ని అనిశ్చితికి తెర దించుతూ, అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ ప్రభుత్వం శనివారం శాసన సభలో చారిత్రక తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం అనంతరం అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. ఇదిలా ఉంటే.. గతంలో జీవో 97, గజిల్ నోటిఫికేషన్ ద్వారా అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికీ, వైసీపీ హయాంలో జరిగిన కుట్రల వల్ల రాజధాని ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే, భవిష్యత్లో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతిని మార్చే వీలు లేకుండా, పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5లో ‘ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి’ అని స్పష్టంగా చేర్చాలని కోరుతూ తీర్మానం.
విభన సమయంలో రాజధానిపై ఉన్న సాంకేతిక అస్పష్టతను తొలగించి, పార్లమెంట్లో చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం.
విభజన కష్టాల నుంచి కోలుకునేందుకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఈ రాజధానికి అవసరమైన వనరులు, నిధులు సమకూర్చాలని కేంద్రాన్ని అభ్యర్థించడం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ