
హైదరాబాద్, 07 మార్చి (హి.స.)తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇచ్చే తెలివి లేదా అని ప్రశ్నించారు. మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని గతంలో ఆయన చెప్పారని.. కానీ ఇప్పుడు తన హయాంలో మూడు పంటలకు రైతుబంధు ఎగొట్టారని ధ్వజమెత్తారు. ఈరోజు(శనివారం) కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం గోపాలరావుపల్లిలో హరీశ్రావు పర్యటించారు. గోపాలరావుపల్లిలో పంట పొలాలను పరిశీలించారు. సాగునీరు లేక అన్నదాతలు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ నేతలు ఏ మొహం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు....? అని హరీశ్రావు నిలదీశారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతారా..? అని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్కు తాగునీటిని అందించేది కాళేశ్వరం నీళ్లేతోనేనని తేల్చిచెప్పారు. తమపై చిల్లర వ్యాఖ్యలను బంద్ చేయాలని.. లేకపోతే తాము ఊరుకోమని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని అడ్డగోలు ఆరోపణలు చేస్తారా..? అని ఆగ్రహించారు. ఈ ప్రాజెక్టును ఎండబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ పిల్లర్లను రేవంత్రెడ్డి సర్కార్ వెంటనే రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరిచ్చారా....? అని హరీశ్రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్