
రాజమండ్రి, 08 మార్చి (హి.స.)రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నం ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లలో ఐటీ సోదాలు చేపట్టారు. ట్యాక్స్ కట్టకుండా బిల్లులు ఎగ్గొడుతున్నారని ఈ రెస్టారెంట్ల, హోటళ్ల యాజమాన్యాలపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆకస్మిక ఐటీ దాడులు జరిగాయి. ఈ క్రమంలో కంప్యూటర్ డేటాను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రధానంగా ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఇటీవల రూ.70వేల కోట్ల అమ్మకాల డిజిటల్ రికార్డులను పలు హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తొలగించారని సమాచారం. ఈ క్రమంలో కీలక ఆధారాలని ఆదాయపన్ను శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఇటీవల నెల్లూరులోని శ్రీ వెంగమాంబ పంజాబీ ఫ్యామిలీ దాబాపై ఐటీ అధికారులు దాడులు చేశారు. కీలక ఆధారాలు సేకరించి, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అదే తరహాలో పన్ను ఎగ్గొడుతున్న సంస్థలని ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్