
హైదరాబాద్, 08 మార్చి (హి.స.)*
సైబరాబాద్ మహిళా పోలీసులు వీధి నిర్వహణలో తమ ప్రతిభ, అంకితభావంతో గుర్తింపు పొందుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా, అధికారిక కార్యక్రమాల్లోనూ తమదైన ముద్ర వేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
అక్టోబర్ 21న నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా, మహిళా పోలీస్ అధికారులు క్రమశిక్షణతో కూడిన పరేడ్లో పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కవాతులో వారు ప్రదర్శించిన ఏకాగ్రత, సమన్వయం, వృత్తిపరమైన అంకితభావం పరేడ్కు మరింత గౌరవాన్ని చేకూర్చింది. నగరానికి విచ్చేసే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు ఇచ్చే 'గార్డ్ ఆఫ్ హానర్', వారి సమయపాలన మరియు బాధ్యతాయుతమైన విధి నిర్వహణకు అద్దం పడుతోంది.
*అప్రమత్తమైన భద్రత..*
కేవలం పగటి విధులతోనే పరిమితం కాకుండా, మహిళా పోలీసులు రాత్రి సమయాల్లోనూ అత్యంత అప్రమత్తతతో సెంట్రీ విధులను నిర్వర్తిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని కీలక ప్రాంతాలు, కార్యాలయాల వద్ద నిరంతరం కాపలా కాస్తూ నగర భద్రతా వ్యవస్థలో తమవంతు కీలక పాత్ర పోషిస్తున్నారు.
వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, హోం గార్డ్స్ వార్షికోత్సవం వంటి అధికారిక కార్యక్రమాల్లో మహిళా పోలీసులు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ తమలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తున్నారు. సభలను సమర్థవంతంగా నడిపిస్తూ, తమ వాగ్ధాటితో కార్యక్రమ నిర్వహణను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
*సీపీ ప్రత్యేక అభినందనలు*
ప్రతిష్టాత్మక 'మిస్ వరల్డ్' పోటీల బందోబస్తు విధుల్లో మహిళా పోలీసులు ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరును పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా కొనియాడారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వారు చూపిన అంకితభావాన్ని గుర్తిస్తూ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఉన్నతాధికారుల నుంచి అందుతున్న ఈ గుర్తింపు, ఇతర మహిళా సిబ్బందికి స్ఫూర్తినిస్తోంది.
*సీపీఆర్తో ప్రాణ రక్షణ*
విధి నిర్వహణలో మహిళా పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ప్రాణదాతలుగానూ నిలుస్తున్నారు. పరిగి నుంచి విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ముగ్గురు ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లు దీపశ్రీ, వనజ, పద్మలు ప్రమాద స్థలిలో చూపిన చొరవ అభినందనీయం
ప్రమాదానికి గురైన బస్సు వెనుక ప్రయాణిస్తున్న వీరు, ఘటన జరిగిన ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారు. క్షణమాత్రం ఆలస్యం చేయకుండా, మరో ఏడుగురు కానిస్టేబుళ్లతో కలిసి మొత్తం 11 మంది క్షతగాత్రులకు సీపీఆర్ నిర్వహించి, వారి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. బాధితులు స్పృహలోకి రాగానే వెంటనే వారిని ఆస్పత్రులకు తరలించారు.
*గాయాలను లెక్కచేయని పోలీస్ ఉక్కు సంకల్పం*
ఇటీవల చేవెళ్ల బస్సు-టిప్పర్ ఢీకొన్న ఈ ఘటనలో పోలీసులు గాయాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. చేవెళ్ల, వికారాబాద్, పరిగి సబ్ డివిజన్ల నుంచి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తూనే, ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఫైర్ సిబ్బందితో కలిసి వెల్డింగ్ కట్టర్ల సాయంతో బస్సు రాడ్లను తొలగించి బాధితులను కాపాడారు. ఈ క్రమంలో పలువురు మహిళా పోలీసులు కు స్వల్ప గాయాలయ్యాయి.
సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీసుల సేవాదృక్పథాన్ని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు