
అమరావతి, 08 మార్చి (హి.స.)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పశ్చిమ బెంగాల్ పర్యటన చేదు అనుభవాలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రోటోకాల్ ఉల్లంఘనల పట్ల దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్రపతి పట్ల అగౌరవం దేశానికే అవమానం అసహనం వ్యక్తం చేశారు. ఆయన తన ట్వీట్లో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన పదవులు రాజకీయాలకు అతీతమని, రాష్ట్రపతి పదవి మన గణతంత్ర వ్యవస్థ యొక్క గౌరవానికి చిహ్నమని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్రపతి పట్ల ప్రదర్శించాల్సిన కనీస మర్యాద, గౌరవంలో లోపాలు జరగడం కేవలం ఆ పదవికే కాకుండా, దేశ రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతమని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
దేశ అత్యున్నత రాజ్యాంగ సంస్థల పవిత్రతను కాపాడటం, వాటికి తగిన గౌరవ మర్యాదలు అందించడం మనందరి సమిష్టి బాధ్యత. రాజకీయ విభేదాలు ఏమైనా ఉన్నప్పటికీ, వ్యవస్థల గౌరవం విషయంలో రాజీ పడకూడదు. రాష్ట్రపతి వంటి ఉన్నత స్థానంలో ఉన్న వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలి పెట్టు అని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటం ద్వారానే మన ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించుకున్నట్లు అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తన ట్వీట్లో రాసుకొచ్చారు.
అసలేం జరిగిందంటే..?
పశ్చిమ బెంగాల్ పర్యటనలో బాగంగా సిలిగుడిలో జరిగిన అంతర్జాతీయ సంతాల్ ఆదివాసీ సదస్సుకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ, ఏ ఒక్క రాష్ట్ర మంత్రి కానీ రాలేదు. దీనిపై రాష్ట్రపతి స్వయంగా స్పందిస్తూ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తనపై కోపంగా ఉందేమోనని, అందుకే కనీస మర్యాద పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, భద్రతా కారణాల పేరుతో సదస్సు వేదికను చివరి నిమిషంలో చిన్న మైదానానికి మార్చడం వల్ల వేలాది మంది గిరిజనులు తనను కలుసుకోలేకపోయారని ఆమె విచారం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV