
కాకినాడ, 09 మార్చి (హి.స.), కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు పంచాయతీ పరిధిలోని పరింతడక గ్రామంలోని పామాయిల్ తోటలో గేదె, దూడలపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడి జరిగిన ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించిన అధికారులు.. మర్రివీడు పంచాయతీతో పాటు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
పులి సంచారంతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు రాత్రివేళల్లో బయటకు రావొద్దని, పశువులను సురక్షితంగా ఉంచాలని సూచించారు. వీలైనంత త్వరగా పెద్దపులిని బంధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పెద్దపులి సంచారం.. అటు పోలవరం జిల్లా, ఇటు కాకినాడ జిల్లా అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ