
ఢిల్లీ., 01 ఏప్రిల్ (హి.స.)
దేశ భవిష్యత్తు ప్రణాళికలకు అత్యంత కీలకమైన 'జనగణన 2027' ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈ భారీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇది దేశవ్యాప్తంగా జరిగే 16వ జనగణన కాగా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇది 8వది. దీనికి గురించి భారత రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పలు విషయాలను వెల్లడించారు. జనగణనలో భాగంగా సేకరించే వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారని, ఏ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థతోనూ కేంద్రం పంచుకోదని ఆయన స్పష్టం చేశారు.ఈసారి జనాభా లెక్కలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గృహగణన, వ్యక్తిగత వివరాల నమోదు ప్రక్రియ ఉంటుంది. రెండొవ దశలో జనాభా గణన చేపడతారు. ఈ రెండవ దశలోనే కులాల గణన కూడా జరుగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. జనగణన 2027లో భాగంగా ప్రజలు తమ వివరాలను తామే ఆన్లైన్లో నమోదు చేసుకునే 'సెల్ఫ్-ఎన్యుమరేషన్' సౌకర్యం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య 15 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ఈ గడువు మారుతూ ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi