అసోంలో రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబులు
అసోంలో పెను ప్రమాదం తప్పింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి రెండు భారీ బాంబులను భారత సైన్యం సురక్షితంగా నిర్వీర్యం చేసింది.
worldwar


టిన్సుకియా, 01 ఏప్రిల్ (హి.స.)

అసోంలో పెను ప్రమాదం తప్పింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి రెండు భారీ బాంబులను భారత సైన్యం సురక్షితంగా నిర్వీర్యం చేసింది. టిన్సుకియా జిల్లాలో మంగళవారం నాడు జనవాసాల మధ్య బయటపడిన ఈ బాంబుల వల్ల పొంచి ఉన్న ముప్పును సైన్యం విజయవంతంగా తొలగించింది. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. టిన్సుకియా జిల్లాలోని లెఖాపానీ బర్మా క్యాంప్ ప్రాంతంలో ఓ పౌరుడు గుంత తవ్వుతుండగా ఈ పేలని బాంబులు బయటపడ్డాయి. వీటిలో ఒకటి జనరల్ పర్పస్ బాంబు కాగా, మరొకటి ఇన్సెండియరీ బాంబు అని అధికారులు గుర్తించారు. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతంలో ఇవి లభించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. వెంటనే పౌర యంత్రాంగం సైన్యానికి సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీకి చెందిన రెడ్ షీల్డ్ డివిజన్, వెంటనే ప్రత్యేక బాంబ్ డిస్పోజల్ బృందాన్ని రంగంలోకి దించింది. ఘటనా స్థలానికి చేరుకున్న బృందం, ముందుగా ఆ ప్రాంతంలోని పౌరులను ఖాళీ చేయించి, పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. అనంతరం బాంబులను అత్యంత జాగ్రత్తగా జనావాసాలకు దూరంగా ఉన్న సురక్షిత ప్రదేశానికి తరలించి, నియంత్రిత పద్ధతిలో నిర్వీర్యం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande