
చిక్కమగళూరు, 11 ఏప్రిల్ (హి.స.) కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చిక్కమగళూరు (Chikkamagaluru)లో 48 గంటలుగా మిస్ అయిన కేరళకు చెందిన 19 ఏళ్ల యువతి అంజలి (Anjali) ఉదంతం విషాదాంతంగా మారింది. గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్ ఇవాళ ఉదయం ఆమె మృతదేహాన్ని గుర్తించాయి. వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన అంజలి, తన స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం చిక్కమగళూరుకు వచ్చింది. బాబా బుడాన్ గిరి శ్రేణులలోని ఒక జలపాతం సమీపంలో ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఆమె ప్రమాదవశాత్తు జారి పడిపోయినట్లుగా సమాచారం. అప్పటి నుంచి ఆమె కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. అదేవిధంగా స్థానిక గిరిజనులు, రెస్క్యూ టీమ్స్ 48 గంటలుగా లోతైన లోయలు, నీటి ప్రవాహాలలో గాలింపు జరిపారు. చివరకు జలపాతం దిగువన ఉన్న రాళ్ల మధ్య అంజలి మృతదేహం చిక్కుకుని ఉండటాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు డెడ్బాడీని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వర్షాకాలం కావడంతో పర్వత ప్రాంతాలు, జలపాతాల వద్ద రాళ్లు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని, పర్యాటకులు సెల్ఫీలు, ఫోటోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చిక్కమగళూరు జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. అంజలి మరణ వార్త విన్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV