
న్యూఢిల్లీ, 12 ఏప్రిల్ (హి.స.)
చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 'డ్రాఫ్ట్ నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా (NFI) 2026'లో భాగంగా.. రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు, జలుబు సిరప్లను (Cough and Cold Syrups) ప్రిస్క్రైబ్ చేయకూడదని, అమ్మకుండా బ్యాన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా 2025లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కలుషిత దగ్గు సిరప్ ల(Diethylene Glycol) కారణంగా జరిగిన చిన్నారుల మరణాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
ఈ ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. ఐదేళ్ల లోపు వారికి సాధారణంగా దగ్గు మందులను సిఫార్సు చేయవద్దు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మందులు ఇవ్వాల్సి వస్తే, అవి కేవలం అర్హులైన వైద్యుల పర్యవేక్షణలో, ఖచ్చితమైన డోసేజ్తో, అతి తక్కువ కాలం మాత్రమే వాడాలని స్పష్టం చేస్తున్నారు. మల్టిపుల్ డ్రగ్ కాంబినేషన్లు ప్రాణాంతకమయ్యే అవకాశం ఉన్నందున వాటిని పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు. చిన్నారులకు వచ్చే సాధారణ దగ్గు, జలుబు వంటివి చాలా సందర్భాల్లో 'సెల్ఫ్- లిమిటింగ్' అని, వాటి కోసం రసాయనాలతో కూడిన మందులు అవసరం లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. రెండేళ్ల లోపు పిల్లల దగ్గుకు ఆవిరి పట్టడం, ముక్కును శుభ్రపరచడం, గోరువెచ్చని నీరు, ద్రవాహారం ఇవ్వడం వంటి హోం రెమెడీలను పాటించడం మేలని చెబుతున్నారు. ఈ డ్రాఫ్ట్ నిబంధనలు త్వరలో దేశవ్యాప్తంగా అధికారికంగా అమలు కానున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీనిపై అడ్వైజరీలు జారీ చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..