BRS, BJP కలిసి పోటీ చేసినా అధికారం మాదే.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
BRS, BJP కలిసి పోటీ చేసినా అధికారం మాదే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar


హైదరాబాద్, 13 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో విమర్శల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మారుస్తామని, త్వరలోనే పాదయాత్ర చేపడతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ Mahesh Kumar Goud) ఘాటుగా స్పందించారు. ఇవాళ ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టారు. కేటీఆర్ చేపట్టబోయే పాదయాత్రలో గత పదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ, దౌర్జన్యాలను కేటీఆర్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి సంస్థలో ఒప్పందాలు, అక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినవేనని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిని ఎంత ప్రయత్నించినా చెరిపివేయలేరని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరని అన్నారు.

పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ (TRS)గా మార్చినంత మాత్రాన ఆ పార్టీ మళ్లీ పుంజుకునే పరిస్థితి లేదని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై ఆ పార్టీ మళ్లీ మొలకెత్తడం అసాధ్యమన్నారు.రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేసినా అధికారం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎవరూ పోటీ ఇచ్చే స్థితిలో లేరని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande