
అమరావతి, 14 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ నియామకాలపై సాక్షి దినపత్రిక, వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, కోడిగుడ్డుపై ఈకలు పీకే విధంగా వ్యవహరిస్తూ ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం హజ్ యాత్రికుల సౌకర్యార్థం, యాత్రపై పవిత్ర భావన కలిగి, అనుభవం ఉన్నవారితోనే కమిటీని ఏర్పాటు చేసిందని షరీఫ్ తెలిపారు. గతంలో జారీ చేసిన జీవో 38లో కొన్ని సాంకేతిక లోపాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ లోపాలను సరిదిద్దుతూ కొత్త జీవో ఇచ్చామని వివరించారు.
స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన ముగ్గురు సభ్యుల పదవీ కాలం ముగిసిందన్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ, ఇద్దరి పదవీ కాలం ముగియగా, మరొకరికి సెప్టెంబర్ వరకు సమయం ఉందన్నారు. ఇది పూర్తిగా నిబంధనల ప్రకారం అధికారులు చేపట్టే సాంకేతిక ప్రక్రియ అని, దీనిపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంపై షరీఫ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముస్లింలపై ఎవరికి ప్రేమ ఉందో చరిత్రే చెబుతుంది. చంద్రబాబు కడపలో రూ.25 కోట్లతో హజ్ హౌస్ నిర్మిస్తే, వైసీపీ ప్రభుత్వం దానిని కోవిడ్ సెంటర్గా మార్చి నిర్వీర్యం చేసింది. కనీసం తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు కూడా దోచుకుపోతుంటే పట్టించుకోలేదు. అలాంటి మీరు ఈరోజు హజ్ పవిత్రత గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది అని ఎద్దేవా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi