
నెల్లూరు, 16 ఏప్రిల్ (హి.స.)రూరల్ నియోజకవర్గంలో రూ.650కోట్లతో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈరోజు(గురువారం) ఉదయం మనుమసిద్ది నగర్లో రూ.2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని జరుగుతున్నాయని వివరించారు. సీఎం చంద్రబాబు, జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఇంతగా అభివృద్ధి పనులు చేయగలుగుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు.
టీడీపీలో అతిసామాన్యులకు ఉన్నత పార్టీ పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఇష్టంగా కష్టం చేస్తే కచ్చితంగా ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే నేరుగా చంద్రబాబు, లోకేశ్ పదవులు ఇస్తారని వెల్లడించారు. నేతలు ఎప్పుడూ జనంలో ఉండాలని.. జనం కోసం పనిచేయాలని సూచించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్లకు రాష్ట్ర కమిటీల్లో స్థానం కల్పించారన్నారు. ‘నిరంతరం జనంలో ఉండాలి.. చమట కారేలా కష్టం చేయాలి. ఎమ్మెల్యే తమ్ముడినని సోగ్గా చొక్కాలు వేసుకుని తిరిగితే పదవులు రావు’ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మారిటోరియం ఛైర్మన్ దామచర్ల సత్య, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. సత్య మాట్లాడుతూ.. ‘మాకందరికీ కోటంరెడ్డి ఆదర్శం. నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే ఉంటారు. రూరల్కు కోటంరెడ్డి సోదరులు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే తపనతో అందరం పనిచేస్తున్నాం’ అని దామచర్ల సత్య వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్