
హైదరాబాద్, 16 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్
విభజనతో పోల్చుతూ లోక్ సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తేజస్వీ సూర్య తెలివిలేని వెధవ అని ఘాటు వ్యాఖ్యలతో మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ఏర్పాటుపై అజ్ఞానంగా మాట్లాడారని అతడి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన పొన్నం... తేజస్వీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. తేజస్వీ మాటలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు తెలంగాణ బిడ్డలైతే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇది ఏ ఒక్కరికో అవమానం కాదని ఇది మన ఉద్యమాన్ని, మన రాష్ట్రాన్ని అమానించడమేనన్నారు.మరొకరు తెలంగాణ ఏర్పాటుపై నోరువిప్పే ధైర్యం చేయకుండా చట్ట ప్రకారం బుద్ధి చెప్పాల్సి ఉందన్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలన్నారు. తేజస్వీ సూర్యపై చర్య తీసుకోవాలని లోక్సభ స్పీకర్ కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ తల్లికి అవమానం జరుగుతుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అంటే తల్లిని అమానించడమేనన్నారు. నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్ రెడ్డి ఇవాళ తెలంగాణ తల్లిని అవమానిస్తే మౌనంగా ఉండిపోయారని మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షా, ఇప్పుడు తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటుపై తప్పుడుగా మాట్లాడారని మండిపడ్డారు. ఇటీవల అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా ఓ టీడీపీ ఎంపీ సైతం ఇదే రకంగా మాట్లాడారని ఇటువంటి అజ్ఞానులు,
ధన బలం, మందబలంతోనో పార్లమెంట్ కు వస్తే అలాంటి వారి పార్టీ అయినా బుద్ధి చెప్పాలి కదా అన్నారు. సహృద్భావ వాతావరణంలో బతకాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడుతూ పుoడుమీద కారం చల్లినట్లు వ్యవహిస్తున్నారని మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..