
న్యూఢిల్లీ, 17 ఏప్రిల్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం సేకరణ అంశంపై వారు కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా 2025-26 యాసంగి సీజన్కు సంబంధించి రాష్ట్రం నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ధాన్యాన్ని సేకరించాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఇక ప్రస్తుత సీజన్లో తెలంగాణలో ధాన్యం దిగుబడి అంచనాలకు మించి ఉంటుందని వారు వివరించారు. ఈ సీజన్లో సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) పంట వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా సాగాలంటే ఎఫ్సీఐ (FCI) ద్వారా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని, నిల్వ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎం వివరించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, రాష్ట్ర విజ్ఞప్తులను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు