
అమరావతి, 18 ఏప్రిల్ (హి.స.)
వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు బట్టబయలైందని, విపక్షం ముసుగులో ఉన్నది ఆర్ఎస్ఎస్ పక్షమేనని తేలిపోయిందని ఆమె ధ్వజమెత్తారు. దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే జగన్కు ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అక్రమ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పలికినందుకు జగన్ సిగ్గుపడాలని అన్నారు.
తన ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతి, కేసుల నుంచి రక్షణ పొందేందుకే జగన్ బీజేపీకి బానిసగా మారారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? బీజేపీ బిల్లులకు గొర్రెలా గుడ్డిగా తలాడించాలా? మోదీ మెప్పుకోసం సొంత కాకిలెక్కలు అల్లాలా? అని నిలదీశారు. మహానేత వైఎస్ఆర్ సిద్ధాంతాలను, విలువలను జగన్ మంటగలిపారని, దీనిపై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించే బిల్లును విపక్షాలు అడ్డుకుంటే, ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఏం సాధించారని జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ దొంగ బిల్లుకు ఓటేసి జగన్ ఏం సాధించారని, కోట్లాది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi