తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నేటి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్!
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నేటి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్!
bus


హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు సర్వం సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కానుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ప్రభుత్వం నుంచి చర్చలకు అధికారిక ఆహ్వానం, డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకే మొగ్గు చూపుతున్నట్లు ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. జేఏసీతో పాటు ఇతర కార్మిక సంఘాలు సైతం సమ్మెకు మద్దతు ఇవ్వడంతో ఆర్టీసీలోని దాదాపు అన్ని యూనియన్లు ఇందులో పాలుపంచుకోనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం తన నివాసంలో ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారుతుందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడపాలని చూస్తే ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. సమ్మెను విజయవంతం చేసి సమస్యలను పరిష్కరించుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నంలోగా ప్రభుత్వం స్పందించకపోతే తాము కూడా సమ్మెలో పాల్గొంటామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande