
న్యూఢిల్లీ, 20 ఏప్రిల్ (హి.స.)
దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే 'డిజిటల్ అరెస్ట్' పేరుతో జరుగుతున్న మోసాల పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీలో ఓ జాతీయ సదస్సులో మాట్లాడుతూ... అమాయకులే కాకుండా చదువుకున్న వారు సైతం ఈ భయాందోళనలకు లోనై సైబర్ మోసాల బారిన పడుతున్నారని. సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి స్కామ్లపై కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో హెచ్చరికలు జారీ చేయాలని సీజేఐ సూర్యకాంత్ సూచించారు. కాగా, ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు తమను తాము సీబీఐ (CBI), ఈడీ (ED), పోలీసు అధికారులమని చెప్పుకుంటూ వీడియో కాల్ చేస్తున్నారు. మీ పేరు మీద అక్రమ పార్సెల్ వచ్చిందని, మనీ లాండరింగ్ కేసుకు సంబంధం ఉందంటూ భయపెడతున్నారు. బాధితులను ఇంటి నుంచే కదలనివ్వకుండా 'డిజిటల్ అరెస్ట్' (Digital Arrest) చేస్తున్నామని నమ్మిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తుండటం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే, అలాంటి కాల్స్ పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో ఇతరను కూడా అప్రమత్తం చేయాలని సీజేఐ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు