
హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.)సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో గుమిగూడటానికి నిషేధం విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా గూడటం నిషేధమని తెలిపారు. పరీక్షా కేంద్రాల దగ్గర వందమీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమలు అవుతాయని వెల్లడించారు. పోలీస్, సైనిక సిబ్బంది, హోం గార్డులకు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉంటుందని అన్నారు. విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ విధులకు అనుమతి ఉంటుందని, అలాగే అంత్యక్రియల ఊరేగింపులకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ రమేశ్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్