గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ


హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం వ్యవహారం మరోసారి వేడెక్కింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్ల పేర్లను వెంటనే ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆయన లోక్భవన్లో గవర్నర్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

ఈ నియామకంపై ప్రభుత్వం ఇంత పట్టుదలగా ఉండటానికి ప్రధాన కారణం అజారుద్దీన్ మంత్రి పదవి. గత ఏడాది అక్టోబర్ 31న మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 30 లోపు చట్టసభ సభ్యుడు కావాల్సి ఉంది. గడువుకు కేవలం 10 రోజులే సమయం ఉండటంతో ఈ అంశం అత్యంత కీలకంగా మారింది. మంత్రివర్గం ఆమోదించి పంపిన ఈ ఫైల్ కొన్ని న్యాయపరమైన కారణాలతో గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలోనే శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్ కూడా గవర్నర్ను కలిసి పరిస్థితిని వివరించారు.

అయితే, సోమవారం (ఏప్రిల్ 22) ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో కోర్టు తీర్పు వచ్చేవరకు గవర్నర్ వేచి చూస్తారా, లేక ముందే నిర్ణయం తీసుకుంటారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ గడువులోగా ఆమోదం లభించకపోతే, అజారుద్దీన్తో రాజీనామా చేయించి తిరిగి ప్రమాణ స్వీకారం చేయించే ప్రత్యామ్నాయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ భేటీలో రాజకీయ అంశాలతో పాటు, విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాల గురించి కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని సీఎం గవర్నర్కు పరిచయం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande