
హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)
ప్రభుత్వాన్ని గద్దె దించాలని కేసీఆర్
(KCR) అంటే.. తామేమీ చేతులు కట్టుకుని కూర్చోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షానికి సూచనలు ఇవ్వాలి కానీ, కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం అయితే ఎలా అని ప్రశ్నించారు. కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు తాము భయపడబోమని.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకుంటేనే తాము అధికారంలోకి వచ్చామని స్పష్టం చేశారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తాము అధికారంలోకి రాలేదన్నారు. మరో 10 ఏళ్ల పాటు తెలంగాణలో తామే అధికారంలో ఉంటామని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీ ఫామ్ ఇచ్చిందని.. ఆయన పార్టీకి ఏం చేశారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తమ పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేస్తున్నాయని అన్నారు. కేసీఆర్ సభ పెడితేనే రైతు భరోసా ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక సంక్షోభం వల్లే కొన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు