
హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)కాలయాపన చేయకుండా తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. అందుకోసం తమ కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న మాట్లాడుతూ.. చర్చలకు సాయంత్రం వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామన్నారు. లేకుంటే యాథావిధిగా సమ్మెకు వెళ్లి తీరుతామని ప్రకటించారు.
మంగళవారం అర్ధరాత్రి నుంచి అన్ని ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ సమ్మెలో అన్నీ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు ఉదయం స్పందించారు. ఈ సమ్మె యోజనను విరమించుకోవాలని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఆయా సంఘాలతో చర్చలకు తాము సిద్ధమని ఆయన ప్రకటించిన విషయం విదితమే.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్