
తిరుమల 21 ఏప్రిల్ (హి.స.)
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బంగారు డాలర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ శుభ సందర్భంగా రెండ్రోజుల వ్యవధిలో ఏకంగా రూ.1.10 కోట్ల విలువైన డాలర్లను భక్తులు కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్లో బంగారం ధరలు అధికంగా ఉన్నప్పటికీ, భక్తి విశ్వాసాలతో భక్తులు డాలర్ల కొనుగోలుకు మొగ్గు చూపారు.
అక్షయ తృతీయ శుభ ముహూర్తం ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఉండటంతో, ఈ రెండు రోజుల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. అందిన సమాచారం ప్రకారం, ఆదివారం రూ.70 లక్షలు, సోమవారం రూ.40 లక్షల విలువైన బంగారు డాలర్లను టీటీడీ విక్రయించింది. గతేడాది అక్షయ తృతీయ నాడు సుమారు రూ.90 లక్షల అమ్మకాలు జరగ్గా, ఈసారి ఆ రికార్డును అధిగమించడం విశేషం.
అక్షయ తృతీయ రోజున శ్రీవారి ప్రతిమ ఉన్న బంగారు డాలరు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ నమ్మకంతోనే తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ విక్రయ కేంద్రం వద్ద భక్తులు బారులు తీరి డాలర్లను కొనుగోలు చేశారు. బంగారు డాలర్లతో పాటు వెండి, రాగి డాలర్లను కూడా టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi