
హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మహా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. జనసేన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం జరగనుంది.
మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.
ఈ హోమానికి అవనిగడ్డ నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi