
హైదరాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) స్పందించారు. గురువారం మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్కు ఊరట కలిగించింది హైకోర్టు కాదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వమంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే దమ్ములేకే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
రెండేళ్లు ఫామ్హౌస్లో పడుకుని ఇప్పుడు మళ్లీ కేసీఆర్ మోటార్లకు మీటర్లు అంటున్నారని కేంద్ర మంత్రి సెటైర్ విసిరారు. పదేళ్ల నుంచి అదే పాట పడుతున్న కేసీఆర్ ఒక్కరోజూ దాన్ని నిరూపించలేకపోయారని విమర్శించారు. మైక్ దొరికితే ఆయనంత మేధావి ఎవరూ లేరని కేసీఆర్ అనుకుంటారన్నారు. ఆర్టీసీ కార్మికులకు రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క జీవోతో వాళ్ల సమస్యలు పరిష్కారం అయ్యేవని.. కానీ ఆర్టీసీ కార్మికులను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్