
హైదరాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డీపోల ఎదుట కార్మికులు ధర్నాలు చేపట్టారు. ఉదయం నుంచే డిపోల ఎదుట బైఠాయించి తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో పలు జిల్లాలో ఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న జేఏసీ నేతలను సైతం పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్నతో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు కదలకుండా కార్మికులు అడ్డుకున్నారు. రెండో రోజు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల వద్ద అధిక చార్జీలతో దోపిడీకి పాల్పడుతున్నారు.
మరోవైపు కోరుట్ల ఆర్టీసీ డీపో దగ్గర ఆర్టీసీ కార్మికుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాకు అనుమతి లేదంటూ టెంట్లు తొలగించారు. దీంతో పోలీసుల తీరుపై ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. మా డిమాండ్లపై ప్రభుత్వం సాగుకూలంగా స్పందించాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయాల వైపు ఆలోచన చేస్తే తాము ఆందోళన పంథాను మారుస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అర్థరాత్రి పిలిచినా చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం చేసిన అలసత్వంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..