
అనకాపల్లి, 23 ఏప్రిల్ (హి.స.)
భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, భవిష్యత్తులో ఈ జిల్లా పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గతంలో వెనుకబడిన రంగారెడ్డి జిల్లా ఎలాగైతే సంపన్న ప్రాంతంగా మారిందో, విశాఖకు సమీపంలో ఉన్న అనకాపల్లిని కూడా మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. గురువారం అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ సోలార్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 6.5 గిగావాట్ల ఇన్గాట్-వేఫర్ తయారీ ప్లాంట్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధిపై తన ప్రభుత్వ దార్శనికతను ఆవిష్కరించారు.
పెట్టుబడులతో పునర్నిర్మాణం
గత ఐదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించాలన్న ఏకైక లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరిగిందని గుర్తుచేస్తూ, ఇప్పుడు రెన్యూ ఎనర్జీ సంస్థ భారీ పెట్టుబడితో ముందుకు రావడం శుభపరిణామమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi