
నిజామాబాద్, 24 ఏప్రిల్ (హి.స.)
ప్రతి నివాస ప్రాంతంలో ప్రజల అవసరాలకు సరిపడా సమృద్ధిగా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడ కూడా దాహార్తి సమస్య తలెత్తకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బోధన్ బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏ. ఈలు, ఎం.పీ.ఓ. అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు.
ఒక్కో మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతులు వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.
వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. రానున్న రెండు మూడు నెలలు ఎంతో కీలకమైనందున, నీటి సరఫరా విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావు లేకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. . చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..