
అమరావతి,24 ఏప్రిల్ (హి.స.)సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాలుగో రోజు కొనసాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం ఆధునిక ప్రజాస్వామ్యంలో అవలంబిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక, పర్యావరణ అనుకూల విధానాలను మంత్రులు అధ్యయనం చేస్తున్నారు. సింగపూర్లోని పరిస్థితులపై మంత్రులకు సింగపూర్ పీఎంవో, మాజీ మంత్రి మిస్టర్ లిమ్ స్వీ సే సమగ్రంగా వివరించారు. దేశ ప్రయోజనాలే కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ సాగే సమష్టి ప్రయాణ పరిణామం, ప్రజలు, ప్రభుత్వ- ప్రైవేట్ రంగాలు సమన్వయంతో పనిచేయడం, దీర్ఘకాలిక అభివృద్ధి, నిజాయితీ ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను నిర్మించడంపై చర్చించారు.
అలాగే నియోజకవర్గ స్థాయిలో స్పందన, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు, స్థానిక సమస్యలను త్వరగా గుర్తించి, పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా చర్చలు జరిపారు. సింగపూర్ అవలంబిస్తున్న విధానాలు రాష్ట్రంలో అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై మంత్రులు అధ్యయనం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, బి.సి. జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్