
విజయవాడ, 24 ఏప్రిల్ (హి.స.)ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (సస్పెండెడ్) కె. శాంతిని ఏసీబీ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఆమెను.. విచారణ నిమిత్తం జైలు నుంచి మొదట వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గతంలో రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించిన సమయంలో.. శాంతి నుంచి సరైన స్పందన రాలేదని, ఆమె విచారణకు సహకరించలేదని ఏసీబీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అక్రమ ఆస్తుల మూలాలు, బినామీల గుట్టు రట్టు చేసేందుకు ఆమెను మరింత విచారించాల్సి ఉందని కోరుతూ రెండోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అధికారుల వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. ఏప్రిల్ 24, 25 తేదీల్లో మరో రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. తాజా విచారణలో అక్రమ ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలు, రహస్య పెట్టుబడుల వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV