
రాఘవాపురం, 24 ఏప్రిల్ (హి.స.)ప్రకృతి ప్రేమికుడు, జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్శర్ల సత్యనారాయణపై గొర్రెల కాపరులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ దాడిలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
రాఘవాపురంలో తనకున్న 70 ఎకరాల భూమిలో దుశ్శర్ల సత్యనారాయణ ఎన్నో ఏళ్లుగా మొక్కలను పెంచి దాన్ని ఒక దట్టమైన అడవిగా మార్చారు. గురువారం ఆయన లేని సమయంలో కొందరు గొర్రెల కాపరులు తమ గొర్రెలను ఆ అడవిలో మేపుతూ చెట్ల కొమ్మలను నరుకుతున్నారు. గురువారం రాఘవాపురానికి చెందిన గొర్రెల కాపర్లు బయ్య గంగయ్య, మల్లయ్య ఆ అడవిలో చెట్లు నరుకుతూ, గొర్రెలను మేపుతూ కనిపించారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన సత్యనారాయణ తన అడవిలో గొర్రెలను ఎందుకు మేపుతున్నారని వారిని ప్రశ్నించారు.
ఈ క్రమంలో మాటామాటా పెరిగి, గొర్రెల కాపరులు కర్రలు, రాళ్లు, గొడ్డళ్లతో ఆయనపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను స్థానికులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi