
హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)
ఆదిభట్ల సర్కిల్ పరిధిలో రోడ్డు ఆక్రమణల పై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. శనివారం ఇంజాపూర్, తుర్కయంజాల్, మన్నెగూడ, బొంగులూరు రింగ్ రోడ్డు వరకు సాగర్ హైవే ప్రధాన రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు, దుకాణాల ముందుకు పొడిగించిన ర్యాంపులు, మెట్లు వంటి అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తూ పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆక్రమణలను గుర్తించి తొలగించినట్లు తెలిపారు. సదరు దుకాణ యజమానులకు ముందుగా పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో కఠిన చర్యలకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ చర్యలతో రహదారులు విస్తరించి, ట్రాఫిక్ రాకపోకలు సాఫీగా జరుగుతాయన్నారు. రహదారులు మళ్లీ ఆక్రమణలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇకపై కూడా రోడ్డు ఆక్రమణలపై ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు