
అమరావతి, 25 ఏప్రిల్ (హి.స.)వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు. జగన్ కనుసన్నల్లో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు మీదకు నెట్టే యత్నం చేశారని విమర్శించారు. అలాగే, పెద్ద దస్తగిరి హత్యను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (శనివారం) అమరావతి వేదికగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న నాయకుడు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తన నైజాన్ని వీడరని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ అధికారం కోల్పోయి రెండేళ్లవుతున్నా తన పంథాను ఇంకా మార్చుకోవట్లేదని ఆగ్రహించారు. నేర సామ్రాజ్యాలు స్థాపించి వాటిని ముందుకు తీసుకెళ్లడం జగన్కే సాధ్యమని సెటైర్లు గుప్పించారు. పెద్ద దస్తగిరి రవీంద్రనాథ్ రెడ్డి బినామీ నా కాదా? అని ప్రశ్నించారు. బినామీ డాక్యుమెoట్లు బట్టబయలైనా ఇంకా బుకాయించి వైసీపీ నేతలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
పెద్ద దస్తగిరి హత్య వెనుక ఎవరున్నా వదలబోమని మంత్రి హెచ్చరించారు. ఆయన హత్యతో రేపు తమ పరిస్థితి ఏంటనే భయం కడప వైసీపీ నేతల్లో మొదలైందని చెప్పుకొచ్చారు. జగన్లో నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఏ కొంచెం ఉన్నా వెంటనే అనంతబాబుతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అనంతబాబు తప్పు చేయలేదని జగన్ భావిస్తే.. ఆయనతో రాజీనామా చేయించి మళ్లీ నిలబెట్టి గెలిపించుకునే శక్తి జగన్కు ఉందా? అని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్