
అన్నవరం:26 ఏప్రిల్ (హి.స.)
త్వరలో సోదరి వివాహం.. బంధువులను ఆహ్వానించి ఘనంగా వేడుక చేయాలనుకున్నారు.. వివాహ ఆహ్వాన పత్రికలు అందజేసేందుకు ద్విచక్రవాహనంపై విజయవాడ నుంచి యలమంచిలికి వెళ్తుండగా కంటెయినర్ లారీ ఢీకొని యువకుడు మృతి చెందాడు. కాకినాడ జిల్లా అన్నవరం జాతీయరహదారిపై ఈరోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదం చూపరులను కలచి వేసింది. విజయవాడ గుణదల అరుళ్నగర్కు చెందిన యర్రంశెట్టి రాజు (29) సోదరి వివాహం త్వరలో జరగనుంది. బంధువులకు ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వరుసకు సోదరుడు అయిన మరో వ్యక్తితో విజయవాడ నుంచి యలమంచలికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఇద్దరూ హెల్మెట్ ధరించారు. మండపం కూడలి వద్దకు చేరుకునేసరికి వాహనాన్ని నడుపుతున్న యువకుడు హెల్మెట్ సరిచేసుకుంటూ నెమ్మదిగా వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా వెనుక నుంచి వచ్చిన కంటెయినర్ ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న రాజు రోడ్డుపై పడి మృతిచెందాడు. అతను ధరించిన హెల్మెట్ కూడా ముక్కలైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కేసునమోదు చేశామని ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ