
విశాఖ, 26 ఏప్రిల్ (హి.స.)
గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది. తుంగ్లం వద్ద రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. నిర్మాణ పనులు చేస్తుండగా పరంజా ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. బాధితులను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. గాయపడిన వారిని బుద్ధీశ్వర్, బోస్, అజిత్, దినేశ్, తుసర్, ప్రతాప్, ఉదయ్గా గుర్తించారు.
దువ్వాడ రైల్వేస్టేషన్ వద్ద పాత బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో స్థానికులు కొన్నాళ్లుగా తరచూ ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన సంబంధిత యంత్రాంగం కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది. కొన్ని రోజుల కిందట పనులు ప్రారంభించింది. అయితే, నేడు బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. బ్రిడ్జిపై కాంక్రీట్ వేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది.
ప్రమాద సమయంలో పనులు చేస్తున్న ఏడుగురు కార్మికులు.. పరంజా కింద చిక్కుకుపోయారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ