
విశాఖపట్నం, 27 ఏప్రిల్ (హి.స.)విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సభను సోమవారం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హాజరుకానున్నారు. విశిష్ట అతిథులుగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్నాయుడు, బి.శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్తోపాటు పలువురు ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరుగుతుంది. సుమారు 25 వేల మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొననున్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన ఏయూ పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా సత్కరిస్తారు. కాగా, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఏయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావడంతో పాటు పలు ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ