
తెలంగాణ, 28 ఏప్రిల్ (హి.స.)
సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department) మరోసారి తన సత్తా చాటింది. చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి బాధితులకు అప్పగించడంలో దేశంలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ను అత్యంత సమర్థవంతంగా వినియోగిస్తూ, రికవరీలో దేశంలోనే టాప్ పెర్ఫార్మర్గా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఏకంగా 1,24,850 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అందజేసింది.
తాజా గణాంకాలను పరిశీలిస్తే.. 2023 ఏప్రిల్ 19 నుంచి 2026 ఏప్రిల్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,82,652 ఫోన్లను పోర్టల్ ద్వారా బ్లాక్ చేశారు. వీటిలో 2,82,260 ఫోన్ల ఆచూకీ కనిపెట్టారు. చివరగా అందులో 1,24,850 మొబైల్స్ను విజయవంతంగా రికవరీ చేసి, అన్లాక్ చేసి బాధితులకు అప్పగించారు. క్షేత్ర స్థాయి పోలీసు అధికారుల అంకితభావం, నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలంగాణ సీఐడీ డీజీ చారు సిన్హా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో సీఈఐఆర్ పోర్టల్ ఆలస్యంగా అమల్లోకి వచ్చినప్పటికీ అనతికాలంలోనే తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. పౌరుల సౌలభ్యం కోసం సీఈఐఆర్ పోర్టల్ను తెలంగాణ పోలీసు సిటిజెన్ పోర్టల్ www.tspolice.gov.in తో అనుసంధానించినట్టు తెలిపారు. తద్వారా ప్రజలు నేరుగా సిటిజన్ పోర్టల్ లేదా www.ceir.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..