పంజాబ్లో కలకలం.. రైల్వే ట్రాక్పై పేలుడు, సమీపంలో మృతదేహం!
పంజాబ్లో కలకలం.. రైల్వే ట్రాక్పై పేలుడు, సమీపంలో మృతదేహం!
patiaala


పటియాలా, 28 ఏప్రిల్ (హి.స.)

పంజాబ్లో సోమవారం రాత్రి ఓ రైల్వే ట్రాక్పై తక్కువ తీవ్రతతో కూడిన పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో రైలు పట్టాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఛిద్రమైన స్థితిలో ఓ మృతదేహాన్ని గుర్తించడంతో అధికారులు పలు ఏజెన్సీలతో దర్యాప్తును ముమ్మరం చేశారు.

పటియాలాలోని శంభు-అంబాలా మార్గంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ పేలుడు జరిగింది. ఈ మార్గంలో ఎక్కువగా గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సమాచారం అందిన వెంటనే పటియాలా ఎస్ఎస్పీ వరుణ్ శర్మ, ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. తక్కువ తీవ్రతతో పేలుడు జరిగింది. దీనివల్ల ట్రాక్కు నష్టం వాటిల్లింది అని ఎస్ఎస్పీ వరుణ్ శర్మ మీడియాకు వెల్లడించారు. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఘటనా స్థలానికి సమీపంలో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మరణానికి, పేలుడుకు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఎస్పీ వివరించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుంచి నమూనాలు సేకరించి, పేలుడుకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. విద్రోహ చర్యల కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటనపై శిరోమణి అకాలీదళ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. పార్టీ సీనియర్ నేత బిక్రమ్ సింగ్ మజిథియా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోనూ ఇదే తరహా పేలుడు జరిగి లోకో పైలట్ గాయపడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande