నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త మలుపు.. నిందితురాలికి మలేషియా లింక్!
నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త మలుపు.. నిందితురాలికి మలేషియా లింక్!
nasik


నాసిక్, 28 ఏప్రిల్ (హి.స.)నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో మత మనోభావాలను దెబ్బతీశారని, బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించారని నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు నాసిక్ నగరాన్ని దాటి మాలేగావ్, మలేషియా వరకు విస్తరించిందని, ప్రధాన నిందితురాలు నిదా ఖాన్కు వ్యతిరేకంగా తమ వద్ద అదనపు ఆధారాలున్నాయని ప్రాసిక్యూషన్ నాసిక్ కోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో మలేషియా ప్రమేయం ఉన్నట్లు ‘ఇండియా టుడే’ తన కథనంలో మొదటిసారి వెల్లడించింది.

నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ మిశ్రా వాదనలు వినిపించారు. బాధితురాలిని ఇస్లాంలోకి మార్చేందుకు నిదా ఖాన్ ప్రయత్నించారని, ఆమెకు మతపరమైన పద్ధతులు నేర్పించారని ఆరోపించారు. బురఖా ఇవ్వడం, ప్రార్థనలు ఎలా చేయాలో నేర్పించడం, ఫోన్లో మత సంబంధిత యాప్లను ఇన్స్టాల్ చేయడం వంటివి చేశారని కోర్టుకు తెలిపారు. బాధితురాలి పేరును 'హనియా'గా మార్చడానికి కూడా ప్రణాళికలు రచించినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది.

ఈ కుట్రలో భాగంగా సహ నిందితుడు డానిష్ షేక్, బాధితురాలికి చెందిన కీలకమైన డాక్యుమెంట్లను తీసుకున్నాడని, వాటిని మాలేగావ్లోని ఒక బృందానికి అప్పగించాల్సి ఉందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అనంతరం ఇమ్రాన్ అనే వ్యక్తి ద్వారా ఉద్యోగం పేరుతో బాధితురాలిని మలేషియాకు పంపేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపింది. ఈ కుట్ర వెనుక ఆర్థిక సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వివరించింది.

ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉందని, మరికొంతమందిని లక్ష్యంగా చేసుకున్నారేమో తెలుసుకోవడానికి ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని మిశ్రా వాదించారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మరోవైపు, నిదా ఖాన్ తరఫు న్యాయవాది రాహుల్ కస్లీవాల్ ఈ ఆరోపణలను ఖండించారు. మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టం లేదని, అసలు మత మార్పిడి జరగలేదని వాదించారు. ఈ కేసులో తొమ్మిది ఎఫ్ఐఆర్లకు బదులుగా ఒకటే నమోదు చేయాలని ఆయన అన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం, నిదా ఖాన్కు ఎలాంటి రక్షణ కల్పించలేదు. తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande