వెనక్కి తగ్గిన కేంద్రం
విమానంలో అరవై శాతం సీట్లను అదనపు రుసుము లేకుండా ప్రయాణించాలన్న ఆదేశాలను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది
Dubai international airport


ఢిల్లీ, 03 ఏప్రిల్ (హి.స.)

విమానాల్లో 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలన్న తమ ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ నిబంధనపై విమానయాన సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు ఈ నిబంధనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తమ ఆందోళనలను తెలియజేశాయి. ఈ ఆదేశాల వల్ల నిర్వహణ, వాణిజ్యపరమైన చిక్కులు వస్తాయని, విమాన ఛార్జీల విధానంపై ప్రభావం పడుతుందని వివరించాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న డీరెగ్యులేటెడ్ టారిఫ్ విధానానికి ఇది విరుద్ధంగా ఉందని పేర్కొన్నాయి.

విమానయాన సంస్థల వాదనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఈ అంశంపై సమగ్ర సమీక్ష జరిపే వరకు 60 శాతం ఉచిత సీట్ల నిబంధనను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు తెలిపింది. సీట్ల ఎంపికకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ప్రయాణికుల ఫిర్యాదుల నేపథ్యంలో మార్చి 18న కేంద్రం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రస్తుతం విమానాల్లో 20 శాతం సీట్లను మాత్రమే ఉచితంగా బుక్ చేసుకునే వీలుంది. మిగతా సీట్లకు ముందు వరుస, అదనపు లెగ్రూమ్ వంటి అంశాల ఆధారంగా ఎయిర్లైన్స్ రూ.200 నుంచి రూ.2,100 వరకు వసూలు చేస్తున్నాయి. అయితే, ఒకే పీఎన్ఆర్పై ప్రయాణించే వారిని పక్కపక్కనే కూర్చోబెట్టడం వంటి ఇతర నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande