
కొమ్రం భీం ఆసీఫాబాద్ జిల్లా, 05 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొమురం భీం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బతుకుదెరువు కోసం ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఒక నిరుపేద కూలీ వడదెబ్బకు బలయ్యాడు. ఈ ఘటన లింగాపూర్ మండలంలోని గోండ్ గూడ గ్రామంలో జరిగింది. ఈ ఏడాది నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు సామాన్యుల ప్రాణాలు హరిస్తున్నాయి.
గోండ్ గూడ గ్రామానికి చెందిన ఆత్రం అక్బర్షావ్ (32) అనే యువకుడు రెండు రోజుల క్రితం ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులకు వెళ్లాడు. పనిలో ఉన్న సమయంలో తీవ్రమైన ఎండ ప్రభావానికి గురై, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మృతి చెందాడు. కుటుంబ భారమంతా మోయాల్సిన యజమాని ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.మరోవైపు అదే గ్రామానికి చెందిన మరో ఏడుగురు కూలీలు కూడా వడదెబ్బ బారిన పడ్డారు. పని ముగించుకుని ఇంటికి చేరిన తర్వాత వారికి వాంతులు, తలతిరగటం వంటి లక్షణాలు కనిపించాయి. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఎండలో వెళ్లేవారు తలపాగా ధరించాలని, ఎప్పటికప్పుడు నీరు తాగుతూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi