
వరంగల్, 05 ఏప్రిల్ (హి.స.) సామాజిక అసమానతలు,
అణచివేతలు, అన్యాయాలపై నిరంతరం పోరాడిన మహానేత డా. బాబూ జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. డా. బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతిని వరంగల్లోని ఎల్బీ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుల వివక్ష నిర్మూలనకు, సామాజిక న్యాయం సాధనకు డా. బాబూ జగ్జీవన్ రామ్ చేసిన కృషి దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన జీవితాంతం చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రతి మనిషికి సమాన గౌరవం కలగాలని ఆయన ఇచ్చిన సందేశం నేటికీ ప్రాసంగికమని అన్నారు. విద్య, ఉపాధిలో సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగ విలువలను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అమలు చేస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు