
హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఆదివారం మరో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్న హైకోర్టు జోన్-ll (High Court Zone-II) భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన పలువురు ప్రముఖ న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఈ సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో కూడిన కోర్టు గదులు, డిజిటల్ లైబ్రరీలు, పరిపాలనా విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రాజెక్టులో భాగంగా రెండో దశలో న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న ఈ జోన్-|| భవనం ద్వారా న్యాయ సేవల వేగం మరింత పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా, న్యాయపరమైన అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు అవసరమైన భవనాలు, సాంకేతికతను అందించడం ద్వారా సామాన్యులకు త్వరితగతిన న్యాయం అందుతుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..