
తిరుపతి, 05 ఏప్రిల్ (హి.స.)
తిరుపతి జిల్లాలోని శేషాపురం పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు ప్రజలను వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎల్లంపల్లి, శేషాపురం గ్రామాల్లో నాలుగు ఏనుగుల గుంపు తిష్టవేసి అరాచకం సృష్టిస్తోంది. పట్టపగలే ఊళ్లలోకి వస్తున్న గజరాజులు అధికారులకు, గ్రామస్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏనుగుల దాడితో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చేతికొచ్చిన పంటలను ఏనుగులు తొక్కి నాశనం చేస్తుండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కేవలం పంటలనే కాకుండా పొలాల్లోని మోటార్లు, ఫెన్సింగ్ రాళ్లను కూడా ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తోంది. నాలుగు రోజుల క్రితం వీటిని అడవిలోకి తోలేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్ సిబ్బందిపైనే ఏనుగులు తిరగబడటం తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అటవీ శాఖాధికారులు వెంటనే స్పందించి, ఏనుగులను లోతైన అడవిలోకి పంపాలని, తమ ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV