
అమరావతి, 10 మే (హి.స.)
ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 15 నుంచి పూర్తిస్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ పార్థసారథి ఉత్తర్వులు ఇచ్చారు. మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 14, 21, 28 తేదీల్లో విచారణలు జరపనున్నాయి. న్యాయమూర్తులు జస్టిస్ వై.లక్ష్మణరావు, జస్టిస్ బాలాజీ మెడమల్లి డివిజన్ బెంచ్గా, జస్టిస్ జి.తుహిన్ కుమార్ సింగిల్ బెంచ్గా విచారణలు చేపడతారు. రెండోదశ వెకేషన్ కోర్టులు జూన్ 4, 11 తేదీల్లో విచారణ జరపనున్నాయి. జస్టిస్ కె.సురేశ్రెడ్డి, జస్టిస్ ఎ.హరిహరనాథశర్మ డివిజన్ బెంచ్గా, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి సింగిల్ బెంచ్గా విచారణలు చేపడతారు. డివిజన్ బెంచ్ కేసుల విచారణ ముగిసిన అనంతరం న్యాయమూర్తులు సింగిల్ జడ్జి బెంచ్ విధులు నిర్వహిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ