
అమరావతి, 13 మే (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం దూసుకెళుతోందని, 'మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్' అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను కూడా పంచుకున్నారు.
మొబైల్ ఫోన్లు, స్క్రీన్ల నుంచి మొదలుకొని ఏసీలు, బైక్లు, కార్ల వరకు.. భారతీయులు విశ్వసించే ఎన్నో బ్రాండ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయి అని లోకేష్ తన పోస్ట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పనుల వేగవంతమైన అమలు, బలమైన తయారీ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని వివరించారు.
మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది వేగంగా నాణ్యతకు, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఆంధ్రప్రదేశ్లో తయారు చేయండి.. ప్రపంచం కోసం తయారు చేయండి అని లోకేష్ పిలుపునిచ్చారు. ఆయన షేర్ చేసిన వీడియోలో ఏపీలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు ప్రఖ్యాత కంపెనీల ఉత్పత్తులను, తయారీ యూనిట్లను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉందని ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi