ప్రధానిపై టీబీజేపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలి: అద్దంకి దయాకర్
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తెలిపారు.
Modi


హైదరాబాద్, 10 మే (హి.స.)ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనను తాము స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తెలిపారు. ప్రధాని పర్యటనతో తెలంగాణకు పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని అద్దంకి దయాకర్ కోరారు. మెట్రో విస్తరణ పూర్తైతే నగర రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, హైదరాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

అలాగే, రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టుకు ఇప్పటికీ పూర్తిస్థాయి అనుమతులు రాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమని, దీనికి త్వరగా ఆమోదం వచ్చేలా తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

ఇక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తే సంతోషిస్తామని, రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మరింత సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande