
హైదరాబాద్, 10 మే (హి.స.)తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరగనుందని తెలిపారు. ఎయిర్పోర్టు మాదిరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతాయని వెల్లడించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటించారు. హెచ్ఐసీసీలో రూ.9,500 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ అందుకోనున్నాం. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ పనులు ప్రారంభం అవుతాయి. గతంలో మోదీ తెలంగాణ పర్యటనల్లో అప్పటి సీఎం హాజరుకాలేదు’ అని అన్నారు.
మోదీ శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులు ఇవే..
రూ.3,180 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన
రూ.2,360 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన
రూ.610 కోట్లతో IOL టెర్మినల్కు శ్రీకారం
రూ.1,243 కోట్లతో కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులు
రూ.1,700 కోట్లతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభం
రూ.300 కోట్లతో నిర్మించిన అండర్ రైల్ బైపాస్ లైన్ ప్రారంభం.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్