
హైదరాబాద్, 10 మే (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చే
కీలక ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.హైదరాబాద్ మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, అనుమతులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరం నలుమూలలా మెట్రో సేవలను విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని మహేష్ గౌడ్ కోరారు. ముఖ్యంగా మెట్రో రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు, తగినన్ని నిధులు విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుద్ధరణ (Musi Rejuvenation) ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కోరారు. అలాగే, రీజినల్ రింగ్ రోడ్ (RRR) పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని, గ్రీన్ ఫీల్డ్ హైవేల విస్తరణకు సహకరించాలని విన్నవించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలను కలిపే రేడియల్ రోడ్ల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం అందించాలి. గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి, పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలి. రాష్ట్ర అభివృద్ధిలో రాజకీయాలకు తావులేకుండా, కేంద్రం తన వంతు బాధ్యతగా నిధుల విడుదల చేయాలని కోరారు. తెలంగాణలోని మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం క్రియాశీలకంగా వ్యవహరించాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని మహేష్ గౌడ్ ఈ లేఖ ద్వారా ప్రధానిని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు