
తిరుమల, 10 మే (హి.స.)
తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ భక్తులు ఫుల్లుగా ఉండగా దర్శనానికి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. టోకెన్ లేనివారికి స్వామివారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట క్యూలైన్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనం అయ్యేందుకు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 4-6 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. కొండపై భక్తుల రద్దీ పెరగడంతో రూముల బుకింగ్ కోసం గంటల తరబడి వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈనెల 18వ తేదీన ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఈ నెల 18 ఉదయం 10 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్లో ఎంపికైన భక్తులు ఈ నెల 20 నుంచి 22 మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు జారీ చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV